Templates by BIGtheme NET
Home >> Telugu News >> వైసీపీ సర్కార్ కు బాక్సైట్ దెబ్బ

వైసీపీ సర్కార్ కు బాక్సైట్ దెబ్బ


విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ ఖనిజంపై ప్రభుత్వ విధానాల్లో చోటుచేసుకున్న మార్పులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పరువు తీసేలా పరిణమించాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా విశాఖ మన్యం నుంచి బాక్సైట్ తవ్వుకునేందుకు గత వైఎస్ఆర్ ప్రభుత్వం అనుమతించింది. జగన్ అధికారంలోకి వచ్చాక ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న అన్ రాక్ సంస్థ తీవ్ర న్యాయపోరాటం చేస్తోంది. ఈ పరిణామంతో జగన్ సర్కార్ ఆత్మరక్షణలో పడింది. ఇక ఈ దెబ్బకు ఒడిషా నుంచి బాక్సైట్ ఇప్పించి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నా అది కూడా కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి కల్పిస్తోంది.

వైఎస్ఆర్ హయాంలో విశాఖ జిల్లాలో రెండు బాక్సైట్ ఒప్పందాలు జరిగాయి. 2005లో జిందాల్ సంస్థతో 2007లో యూఏఈలోని రస్ అల్ ఖైమా ప్రభుత్వ సంస్థ అన్ రాక్ తో ఈ ఒప్పందాలు జరిగాయి. 30 ఏళ్ల పాటు బాక్సైట్ సరఫరాకు ఏపీ ఖనిజావృద్ధి సంస్థకు బాధ్యతలు అప్పగించారు. అయితే వీటిపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఇరుకునపడింది. స్థానికంగా అభ్యంతరాలను పట్టించుకోకుండా చేసుకున్న ఒప్పందాలు ప్రభుత్వాలకు గుదిబండలా మారిపోయాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గతంలో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేశారు. దీనిపై రెండు సంస్థలు న్యాయపోరాటం చేశాయి. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక లీజులను రద్దు చేశారు. దీంతో జిందాల్ అన్ రాక్ సంస్థలు లా ట్రిబ్యూనల్ అంతర్జాతీయ కోర్టుల్లో కేసులు వేశాయి. దీంతో ఏపీ సర్కార్ కు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.

ఒడిషా నుంచి అన్ రాక్ సంస్థకు బాక్సైట్ ఇప్పించాలని ఏపీ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే అక్కడి ప్రభుత్వం ఇప్పటికే వేరే సంస్థకు లీజుకు ఇచ్చింది. దీంతో భారీగా చెల్లించి లీజు తీసుకోలేక.. అన్ రాక్ తో పోరాటం చేయలేక ఏపీ ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. కేంద్రం జోక్యం చేసుకొని ఒడిషాలోని బాక్సైట్ ఇప్పించాలని జగన్ సర్కార్ కోరుతోంది.