Templates by BIGtheme NET
Home >> Cinema News >> సంక్రాంతికి ఫిక్స్.. మాస్ రాజా మోగించారు జేగంట

సంక్రాంతికి ఫిక్స్.. మాస్ రాజా మోగించారు జేగంట


క్రిస్మస్ బరిలో సాయి తేజ్ నటించిన `సోలో బ్రతుకే సోబెటర్` రిలీజవుతుండగా సంక్రాంతికి డేర్ చేసే హీరోలు ఎవరు? అంటూ ఆసక్తికర చర్చ మొదలైంది. ఇంతలోనే మాస్ మహారాజా రవితేజ నేనున్నాను! అంటూ జేగంట మోగించారు. థియేటర్లు తెరిచాక టాలీవుడ్ నిర్మాతలు సంక్రాంతి సీజన్ పై ఆశపడ్డారు. కనీసం అప్పటికి మహమ్మారీ నుంచి బయటపడితే అయినా బతికి బట్టకట్టగలం అన్న ఆశాభావం వ్యక్తమైంది. ఎందుకంటే పెద్దా చిన్నా అన్న తేడా లేకుండా ఈ సీజన్ లో బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం దక్కుతుందన్న నమ్మకం .. ధీమా.

అప్పట్లోనే పలువురు సంక్రాంతి రిలీజ్ పై దృష్టి సారించామని ప్రకటించారు. తాజాగా మాస్ మహారాజ్ రవితేజ ‘క్రాక్’ ని సంక్రాంతికి అధికారికం చేసారు. జనవరి 14న క్రాక్ రిలీజవుతుందని తాజాగా సంగీత దర్శకుడు తమన్ రివీల్ చేశారు. నిర్మాణానంతర పనులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. క్రాక్ బీజీఎం గురించి మూడో సింగిల్ గురించి థమన్ వెల్లడించారు. థియేట్రికల్ ట్రైలర్ త్వరలో వస్తుందని తెలిపారు. దీన్ని రీట్వీట్ చేస్తూ దర్శకుడు గోపిచంద్ మలినేని # క్రాక్ ఆన్ 14 అనే హ్యాష్ ట్యాగ్ ను ఉపయోగించారు. కాబట్టి సంక్రాంతి బరిలో క్రేజీ సినిమాగా `క్రాక్` బరిలో దిగుతోందని అర్థమవుతోంది. శ్రుతి హాసన్ నాయికగా నటిస్తున్న సంగతి తెలిసినదే. ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.