Templates by BIGtheme NET
Home >> Cinema News >> థియేటర్స్ రీఓపెన్.. ఆదరించి ఆశ పెంచిన జనం

థియేటర్స్ రీఓపెన్.. ఆదరించి ఆశ పెంచిన జనం


కరోనా భయాల నడుమ థియేటర్లు తెరిచినా జనం వస్తారా రారా? అన్న సందిగ్ధత నెలకొంది. ఎగ్జిబిటర్లలో పూర్తి నమ్మకం లేకుండానే ఇప్పుడు థియేటర్లను తెరుస్తున్నారు. డి.సురేష్ బాబు లాంటి అగ్ర నిర్మాత అయితే థియేటర్లు తెరవడాన్ని గతంలోనే నిరసించారు. వర్కవుట్ కాదని పెదవి విరిచేశారు. కానీ ప్రభుత్వాల ప్రోత్సాహంతో ఎట్టకేలకు మల్టీప్లెక్సుల్ని తెరిచారు.

కోవిడ్ నియమనిబంధనల ప్రకారం సగం సీట్లకే టిక్కెట్లు అమ్మారు. అయితే ఆశావహంగా జనం మార్నింగ్ షో నుంచి చక్కని ఆదరణ చూపడం ఆశను పెంచింది. క్రిస్టోఫర్ నోలాన్ టెనెట్ మూవీ బ్రహ్మాండమైన ఆదరణ దక్కించుకుంది అంటూ ఆనందం వ్యక్తమైంది.

హైదరాబాద్‍ లో ఏఎంబీ- ఐమ్యాక్స్ – పంజాగుట్ట ఏరియా మల్టీప్లెక్స్ ల్లో టెనెట్ ని ప్రదర్శించగా దానికి మంచి ఆదరణ దక్కింది. జనం ఇండ్ల నుంచి బయటికి వచ్చారు. థియేటర్లకు రావడానికి జంకలేదని తెలిసింది. తొలి రోజు చక్కని ఆదరణ దక్కినట్టే. అలాగే ఈ రోజు శుక్రవారం సక్సెస్ ని కంటిన్యూ చేస్తూ శని ఆదివారాల టికెట్ బుకింగ్స్ బావున్నాయని మల్టీప్లెక్స్ వాళ్లు చెబుతున్నారు. ఇది నిజంగా ఆశావహ ధృక్పథాన్ని పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మునుముందు తెలుగు క్రేజీ సినిమాల్ని రిలీజ్ చేస్తే ఆదరణకు కొదవేమీ ఉండదన్న భావనను పెంపొందించింది. అయితే సినిమా అనేది కేవలం మల్టీప్లెక్సుల్లో ఆడితే లాభాలు తేలేదు. సింగిల్ స్క్రీన్లలోనూ ఆడాలి. అప్పుడే సక్సెస్ దక్కుతుంది. పెట్టిన పెట్టుబడులు తిరిగి వస్తాయి. అయితే సింగిల్ థియేటర్లు తెరిపించాలంటే ఎంతో డెడికేషన్ కావాలి. అక్కడ శానిటేషన్ సహా బాత్రూమ్ లిట్రిన్ల మెయింటెనెన్స్ సవాళ్లతో కూడుకున్నది. ఇలాంటి సమయంలో అందుకు ప్రత్యేకించి అదనపు భారం మోయాలి. లాభం ఉన్నా లేకున్నా వాటన్నిటినీ మెయింటెయిన్ చేయాలి. ఇవన్నీ నిబద్ధతతో చేయగలిగితేనే జనం భయపడకుండా థియేటర్లను నమ్మి వస్తారు. ఏమాత్రం సందేహం కలిగినా ఇక థియేటర్ల ముఖం చూసేందుకు భయపడతారు. అలాంటి పరిస్థితి రాకూడదనే ఆశిద్దాం.

ఎనిమిది నెలల క్రైసిస్ అనంతరం థియేటర్లలోకి రానున్న తొలి క్రేజీ చిత్రం సాయి తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ అవుతుందని భావిస్తున్నారు. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా ఈ నెలలో థియేటర్లలో రిలీజ్ కి వస్తోంది. ఆ తర్వాత సంక్రాంతి బరిలో మరిన్ని క్రేజీ చిత్రాలు రిలీజ్ కానున్నాయి.