ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 12దేశాల్లో మంకీపాక్స్ వ్యాపించింది. మొదటల్లో ఒకటి రెండు కేసులతో మొదలై ఇప్పుడు వెయ్యికి చేరువ అవుతోంది. ఈనేపధ్యంలోనే భారత్లోనూ మంకీ పాక్స్ కలవరం మొదలైంది. ఈ కొత్తరకం వ్యాధి కేసుల్ని గుర్తించడం, బాధితులకు ట్రీట్మెంట్ అందించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలంటోంది కేంద్రం. ఈపరిస్థితుల్లోనే తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక ఆదేశాలను జారీ చేసింది. మంకీపాక్స్ బాధితులను గుర్తించాలని..ఒకవేళ ఎవరైనా లక్షణాలు కలిగి ఉంటే వారిని 21 రోజులు ఐసోలేషన్లో ఉంచాలని సూచించింది. మంకీపాక్స్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని లక్షణాలు 2-4 వారాల్లో తగ్గిపోతాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
అన్నీ ఆసుపత్రుల్లో చికిత్స ఏర్పాట్లు..
మంకీపాక్స్ గుర్తించాల్సిన లక్షణాలను సైతం గతంలోనే వెల్లడించారు అధికారులు. జ్వరం, శరీరం, ముఖంపై పెద్ద పెద్ద దద్దుర్లు, చర్మంపై బుడగలు వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. అనుమానితుల రక్త నమూనాలను పుణెలోని ఎన్ఐవీకి పంపిస్తున్నారు. లక్షణాలు ఉన్నవారికి పాజిటివ్గా నిర్ధారణ జరిగితే 21రోజుల పాటు ఐసొలేషన్లో ఉంచాలని ఆదేశించారు. చర్మంపై బుడగలు తొలిగిపోయి, పైపొర పూర్తిగా ఊడిపోయి, కొత్త పొర ఏర్పడే వరకు చికిత్స పొందాలని తెలిపింది. ఒకరి నుంచి మరొకరికి మంకీపాక్స్ సోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మంకీపాక్స్ కేసులు నమోదవుతున్న దేశాల నుంచి గత 21 రోజుల్లో వచ్చిన వాళ్లతో పాటు వారిని కాంటాక్ట్ అయిన వారిలో కూడా వ్యాధి లక్షణాలు కనిపించవచ్చని అధికారులు అలర్ట్ చేశారు. ,
భయపెడుతున్న వైరస్..
బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్, కెన్యా, అమెరికా సహా 45 దేశాల్లో మంకీపాక్స్ విస్తృతంగా వ్యాపిస్తోంది. మంకీ పాక్స్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఇటు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్నికేసులు పెరిగే అవకాశం ఉందంటున్నారు. మశూచికి వాడే టీకాలు మంకీపాక్స్ వైరస్ని కట్టడి చేయడానికి పనిచేస్తాయా లేదా అనే దానిపై రీసెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం మంకీపాక్స్ సోకిన వారికి అమ్మవారు పోసినప్పుడు చేసే ట్రీట్మెంట్నే అందిస్తున్నారు. ఇది 85శాతం ప్రభావం చూపుతోందని నిపుణులు చెబుతున్నారు.